Teluguwonders:
ఉత్తర్ప్రదేశ్:
ఇంటి నిర్మాణం కోసమో లేక బావి కోసమో భూమిని తవ్వినప్పుడు లంకె బిందెలు లేక బంగారంతో నిండిన పెట్టెలు దొరకడం గురించి వినే ఉంటాం. అలాంటి నిధి దొరికితే ఎవరికి సొంతం అని ఎప్పుడైనా ఆలోచించారా? ఆ ప్రదేశం లేక స్థలం ఎవరి అధీనంలో ఉంటే, నిధి వారి సొంతం అనుకుంటాం. అంతే కదా..! కానే కాదు. అది ప్రభుత్వానికి చెందుతుంది. చట్టపరంగా చూసుకుంటే మనం దానికి సంబంధించిన పత్రాలు చూపిస్తేనే.. ఆ నిధి మనకు స్వాధీనం అవుతుంది. లేదంటే ప్రభుత్వ వశం అవుతుంది.
ఉత్తర్ప్రదేశ్ హార్దోయి జిల్లాకి చెందిన ఓ యజమాని తన ఇంటి నిర్మాణం కోసం పునాదులు తవ్విస్తుండగా ఓ పెట్టె బయటపడింది.
ఏంటా అని తెరచి చూస్తే దాని నిండా బంగారు, వెండి ఆభరణాలే… ఎంచక్కా నిధి దొరికింది అన్న సంతోషంలో ఆ యజమాని మునిగి తేలాడు. కానీ దేవుడు వరమిచ్చినా.. పూజారి కరుణించకపోవడం బహుశా ఇదే కాబోలు. అతనికి నిధి దొరికిందనే విషయం మెల్లగా ఆ నోట ఈ నోట పడి ఊరంతా పాకేసింది. ఇంక పోలీసులు రంగ ప్రవేశం చేశారు. యజమానిని ఆరా తీయగా.. మొదట ఏం దొరకలేదని బుకాయించాడు. తర్వాత ఒప్పుకోక తప్పలేదు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆ నిధి సుమారు వందేళ్ల నాటిది కనుక పురావస్తు ప్రాముఖ్యత కలిగిందని పేర్కొన్నారు. 650 గ్రాముల బంగారం, 4.53 కేజీల వెండి ఉన్న ఆ పెట్టె మొత్తం విలువ రూ.25 లక్షలుగా లెక్కకట్టారు. ఈ నిధికి సంబంధించిన పత్రాలు అతని దగ్గర లేకపోవడంతో స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.
మామూలుగా ఎటువంటి ఖరీదైన ఆభరణాలు, బంగారం లాంటివి భూమిలో దొరికినప్పుడు వాటిని నిధిగా పరిగణిస్తారు. అలాంటివి ఇండియన్ ట్రెజర్ ట్రోవ్ యాక్ట్ 1878 సెక్షన్ 4 ప్రకారం ఆ ప్రాంతానికి చెందిన జిల్లా రెవెన్యూ అధికారులకు సమాచారం ఇవ్వాలి. లేదంటే నిధిని తీసుకెళ్లి నేరుగా వారికి అప్పగించాలి. ఏదేమైనప్పటికీ అదే చట్టం సెక్షన్ 11 చూసుకుంటే.. పోలీసు అధికారుల విచారణానంతరం ఆ నిధి ఎవరికీ చెందదని తేలితే… దొరికిన వారికే సొంతం అయ్యే అవకాశం లేకపోనూలేదు.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.