Teluguwonders:
ప్రస్తుత కాలంలో ఎవరి లాభం వారు చూసుకుంటారు. ఉద్యోగమైనా… వ్యాపారమైనా.. ఏది చేస్తే తనకు లాభం వస్తుందనే ఆలోచిస్తారు. కానీ… ఓ బామ్మ మాత్రం లాభాపేక్ష లేకుండా నిరుపేదల కడుపు నింపుతోంది. కట్టలపొయ్యి మీద తాను కష్టపడుతూనే… తన హోటల్ కి వచ్చిన వారికి కేవలం ఒక్క రూపాయికే ఇడ్లీ అందిస్తోంది. కాగా… ఆ బామ్మ చేస్తున్న పని ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా కంట పడింది. ఆమె చేస్తున్న పనికి ఫిదా అయిన ఆయన… బామ్మ వివరాలు చెబితే… ఆమెకు ఉచితంగా గ్యాస్ సరఫరా చేస్తానని చెబుతున్నాడు.
ఇంతకీ మ్యాటరేంటంటే…కమలతల్ స్వస్థలం తమిళనాడులోని పెరూ సమీపంలో వడివేలంపాళ్యం. ఆమె చట్నీ, సాంబార్తో కలిపి ఒక్కో ఇడ్లీ రూపాయికే అమ్ముతూ అనేక మందికి పొట్టనింపుతున్నారు.
35 ఏళ్లుగా కమలతల్ ఇదే రీతిలో సేవలందిస్తున్నారు. రోజూ సూర్యోదయానికి ముందే లేచి ఆమె తన పని మొదలు పెడతారు. తక్కువ ధరకే ఇడ్లీలు అందించడానికి కారణం ఏంటని అడిగితే.. రోజువారీ కూలీలు పొట్టనిండా తిని , డబ్బులు ఆదా చేసుకోవడమేనని ఆమె సమాధానం చెబుతారు.
గతంలో కమలతల్ ఒక్కో ఇడ్లీ అర్థరూపాయికే అమ్మేవారు. అయితే ఇప్పుడు సరుకుల ధరలు విపరీతంగా పెరగడంతో ఒక్క రూపాయికి అమ్ముతున్నారు. రోజుకు వెయ్యి ఇడ్లీలకు పైగా అమ్ముతున్న ఆమె…”లాభం నాకు ముఖ్యం కాదు.. అందరి ఆకలి తీర్చాలన్న కోరికే వారిని నా ఇంటికి రప్పిస్తుంది…” అని ఆమె పేర్కొనడం విశేషం.
ఈ ఘటనపై ఆనంద్ మహీంద్రా స్పందించారు. ‘మనలను ఆశ్చర్యచకితులను చేసే అద్భుత గాథల్లో ఇది కూడా ఒకటి. కమలతల్ లాంటి వాళ్లు చేసే పనిలో కొంత చేసినా ఎంతో మందికి మేలు జరుగుతుంది. ఆమె ఇప్పటికీ కట్టెల పొయ్యినే వాడుతున్నట్టు నేను గుర్తించాను. ఆమె ఎవరికైనా తెలిస్తే చెప్పండి. సంతోషంగా ఆమె వ్యాపారంలో ‘పెట్టుబడి’ పెట్టి, ఎల్పీజీ గ్యాస్ స్టవ్ కొనిపెడతా.. అని ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు.
ఆయన పిలుపుపై ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సైతం స్పందించింది. ”బాగా చెప్పారు సార్. దేశం కోసం ఇండియన్ ఆయిల్ ఏ స్ఫూర్తితో పనిచేస్తుందో దాన్ని తన సామాజిక సేవతో ఆమె మరింత ప్రతిధ్వనింప చేస్తున్నారు…” అని పేర్కొంది. ఆమెకు ఇండేన్ ఎల్పీజీ సిలిండర్తో పాటు గ్యాస్ స్టవ్, రెగ్యులేటర్ అందజేసిట్టు వెల్లడించింది.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.