పండ్లలో రారాజు మామిడి. వేసవి రాగానే మెుదట గుర్తొచ్చేది ఈ పండే. అయితే.. పట్టణాల్లో ఎక్కువ శాతం.. కృత్రిమంగా పండిన మామిడి పండ్లనే అమ్ముతున్నారు. వీటిని తినడం వల్ల జనాలు అనారోగ్యం బారిన పడుతున్నారు. మరి కృత్రిమంగా పండిన మామిడి పండ్లను గుర్తించండం ఎలా..?
వేసవికాలంలో విరివిగా కనిపించే పండ్లలో మామిడి పండ్లు ఒకటి. సీజన్ ప్రారంభమైన దగ్గర నుంచి ఊరు, వాడ, పట్టణాల్లో ఎక్కడ చూసినా మామిడి పండ్లు కనిపిస్తుంటాయి. ఫలరాజుగా పేరున్న మామిడి అంటే ఇష్టం లేని వారు ఉండరు. మామిడి ప్రియులకు ఉండే అదే ఇష్టాన్ని కొందరు వ్యాపారులు క్యాష్ చేసుకునేందుకు అడ్డదార్లు తొక్కుతున్నారు. సహజంగా మామిడి పండ్లను చెట్టు నుంచి కోసిన తర్వాత కొద్ది రోజులు మాగబెడితే పక్వానికి వస్తాయి. కానీ వ్యాపారులు మాత్రం అలా సహజ పద్ధతిలో నిల్వ ఉంచకుండా కృత్రిమంగా రసాయనాలతో మగ్గబెడుతున్నారు. నిషేదిత కాలుష్యం కార్బైడ్ తో పాటు ఇతర రసాయనాలను వినియోగించి పక్వానికి తెచ్చే ప్రక్రియ చేస్తున్నారు. ఈ పద్ధతి వల్ల మామిడికాయ కొన్ని గంటల్లోనే రంగు మారి తినటానికి సిద్ధంగా ఉండేలా తయారవుతుంది. కృత్రిమ పద్ధతి ద్వారా మామిడికాయ పసుపు రంగులోకి మారి మామిడి పండుగా రూపాంతరం చెందుతుంది. అలా చేయటం వల్ల పండు రంగు మారుతుంది తప్ప.. సహజంగా పండినప్పుడు ఇచ్చే రుచి ఉండదు. అంతేకాకుండా నిషేధిత రసాయనాలు వాడటం వల్ల మామిడిపండు కూడా విషతుల్యంగా మారుతుంది. అలాంటి పండ్లు తినడం వల్ల ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. నిషేధిత రసాయనాలతో పక్వానికి తెచ్చిన పండ్లను తింటే క్యాన్సర్, లివర్, కిడ్నీ, జీర్ణ సంబంధిత వ్యాధులు, నరాల బలహీనత వంటి వ్యాధులు బారిన పడే అవకాశం ఉంది.
రసాయనాలతో మగ్గబెట్టిన మామిడి పండ్లును గుర్తించడం ఎలా?
రంగును చూసి మామిడి పండ్లను చాలా వరకు గుర్తించడానికి అవకాశాలు ఉన్నాయి. రసాయనాలు ఉపయోగించి పక్వానికి తెచ్చిన పండ్లు బయటకి లేత పసుపు… లోపల లేత తెలుపు రంగులో ఉంటాయి. సహజంగా పండిన పండు బయట లోపల ఒకే రంగులో ఉంటుంది. అలాగే రసాయనాలు విడుదల చేసే ఎసిటిలిన్ వాయువుతో పండ్లు బయట వైపు రంగు మారుతుంది తప్ప లోపల సహజమైన రంగు రాకపోగా రుచి కూడా ఉండదు. అలానే కెమికల్ పౌడర్ చల్లితే.. మామిడి కాయల మొదలు భాగం పండదు. అలాగే, దానిపై ఆకుపచ్చ, పసుపు పాచెస్ కనిపిస్తాయి. అదే నేచురల్గా పండిన మామిడి పైభాగంలోని పసుపు పచ్చ రంగు అతుకులుగా కాకుండా ఏకరీతిగా ఉంటుంది.
రసాయనాల నుంచి కొంతమేర తప్పించుకునేది ఎలా?
మామిడి పండ్లను ఎత్రిల్ అనే లిక్విడ్ లో ఐదు నిమిషాలు ఉంచి.. మూడు నాలుగు రోజుల పాటు నిల్వ చేసుకొని తింటే కొంతమేర సహజత్వానికి దగ్గరగా ఉంటుంది. ఈ పద్ధతి ద్వారా మామిడిపండ్లను శుభ్రపరిచి కొంతమేర ఆరోగ్యాన్ని రక్షించుకోవచ్చు అని చెప్తున్నారు వైద్యులు.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.