కేసీఆర్ డెడ్ లైన్ ను లైట్ గా తీసుకున్న ఆర్టీసి కార్మికులు..!

Spread the love

హైదరాబాద్ : తెలంగాణలో ఆర్టీసి కార్మికులు చేస్తున్న సమ్మె పట్ల ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు విధించిన గడువు మరి కొద్ది గంటల్లో ముగియనుంది. ఆర్టీసి ఉద్యోగులు బేషరతుగా ఉద్యోగాల్లో చేరాలని చంద్రశేఖర్ రావు పెట్టిన డెడ్ లైన్ గడువును కూడా ఉద్యోగులు పెద్దగా ఖాతరు చేసినట్టు లేదు. ముఖ్యమంత్రి రెండు సార్లు ఉద్యోగులను హెచ్చరించినప్పటికి వారు పట్టు వీడలేదు, మెట్టు దిగలేదు. దీంతో నేటి మంగళవారం అర్దరాత్రితో చంద్రశేఖర్ రావు పెట్టిన గడువు కూడా ముగుస్తుంది. తర్వాత ఉద్యోగుల కార్యాచరణ, ప్రభుత్వ వ్యూహం ఏంటనే అంశంపై ఆసక్తి నెలకొంది. ఆర్టీసి రహిత తెలంగణ వైపు ప్రభుత్వం అడుగులు వేస్తుందనే చర్చ కూడా జరుగుతోంది. ఐతే ఉద్యోగులను తొలగించి, సంస్థను నిర్మూలించే అధికారం ముఖ్యమంత్రికి లేదని కార్మిక సంఘాల నేతలు చెప్పుకొస్తున్నారు.

సీఎం డెడ్ లైన్ భేఖాతరు.. మరికొన్ని గంటల్లో ముగియనున్న కేసీఆర్ గడువు.. తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ సమ్మె కొనసాగుతూనే ఉంది. సమ్మె విరమణ కోసం ప్రభుత్వం చేస్తున్న డిస్మిస్ ప్రకటన, డెడ్ లైన్లకు ఆర్టీసీ కార్మికులు ఏ మాత్రం భయపడడం లేదు. యూనియన్ నేతల మాటలు నమ్మకుండా ఆర్టీసి ఉాద్యోగులు ఈ నెల 5 లోగా కార్మికులు భేషరతుగా విధుల్లో చేరాలని ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు శనివారం డెడ్ లైన్ విధించిన సంగతి తెలిసిందే. కాగా కార్మికులు మాత్రం చర్చలు, ప్రభుత్వం తరుపునుండి ఎలాంటి హామీ లేకుండా విధుల్లో చేరే ప్రసక్తే లేదని తేల్చి చెబుతున్నారు.

ప్రభుత్వానికి, కార్మికుల మద్య కొనసాగుతున్న ప్రతిష్టంభన.. పట్టు విడిచేది లేదంటున్న ఉద్యోగులు.. అంతే కాకుండా ఇంతవరకూ సెప్టెంబరు నెల వేతనాలు సైతం రాకపోవడం, సమ్మె నెల రోజులకు చేరడం.. దరిదాపుల్లో ముగిసే అవకాశం లేక పోవడం, ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు పట్టు వీడేలా కనిపించక పోవడంతో నిరుపేద కుటుంబాలకు చెందిన అనేక మంది కార్మికులు విధుల్లో చేరుతారని ప్రభుత్వంతో పాటు టీఆర్ఎస్ వర్గాలు భావించాయి. ఆర్టీసీ జేఏసీ చైర్మన్ అశ్వథ్దామరెడ్డి సైతం విధుల్లోకి చేరే కార్మికులు ఒకటి, రెండు శాతం లోపే ఉంటుందని ప్రకటించారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంది.

పట్టు తప్పని కార్మికులు.. కార్మిక నేతల పట్ల పూర్తి భరోసా.. కార్మికులను యూనియన్ల నుంచి వేరు చేసేందుకు ప్రభుత్వం చేసే ప్రయత్నాలు ఏ మాత్రం ఫలించడం లేదు. ఇన్ని రోజులు సమ్మె, ఆందోళనలు చేసి ఏ మాత్రం హమీ లేకుండా విధుల్లో చేరేది లేదని స్పష్టం చేస్తున్నారు ఉద్యోగులు. డబ్బులతో సంబంధంలేని సమస్యల పరిష్కారానికి కూడా ప్రభుత్వం చొరవ తీసుకోక పోవడంపై మండి పడుతున్నారు. జీతం రాకపోవడంతో ఆర్థిక సమస్యలు వేధిస్తున్నా, ఆత్మ గౌరవం చంపుకొని డ్యూటీలో చేరి మిగతా కార్మికులకు ద్రోహం చేయలేమంటున్నారు కార్మికులు. ఐతే ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు విధించని డెడ్ లైన్ గడువు పట్ల కార్మికలోకం కించిత్ బాధ కూడా పడడంలేదని తెలుస్తోంది.


Discover more from Telugu Wonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from Telugu Wonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading