Teluguwonders:
బెంగళూరు: కర్ణాటకలోని ఉద్యోగాలన్నీ స్థానికులకే ఇవ్వాలని ప్రముఖ నటుడు ఉపేంద్ర డిమాండ్ చేశారు. ఇందుకోసం పోరాటం సాగిస్తానని ఆయన తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోను విడుదల చేశారు.
‘కర్ణాటకలో ఉద్యోగాలు కన్నడిగులకే ఇవ్వాలి. దీని గురించి ఎన్నో సంవత్సరాలుగా పోరాటం జరుగుతోంది. రాష్ట్రంలోని ఉద్యోగాల్లో వారికే మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని అందరి ఆకాంక్ష కూడా. ఇందుకోసం నేను పోరాటం చేస్తాను. ఈ మేరకు ఈ నెల 14, 15 తేదీల్లో గాంధీ విగ్రహం వద్ద నిరాహార దీక్ష చేస్తాను. ఇందుకు నాకు యువత మద్దతుగా నిలవాలని కోరుకుంటున్నాను. నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాను’ అని ఉపేంద్ర వీడియోలో చెప్పుకొచ్చారు.
స్వతహాగా బెంగళూరు ఐటీ రాజధాని కావడంతో దేశ నలుమూలల నుంచి ఉపాధి కోసం అక్కడికే వస్తుంటారు. దీంతో స్థానికులకు అన్యాయం జరుగుతుందనే వాదన ఎప్పటి నుంచో ఉంది.
రాష్ట్రంలో నెలకొన్న సమస్యలపై ఇటీవలి కాలంలో ఉపేంద్ర గట్టిగానే పోరాటం చేస్తున్నారు. అప్పుడప్పుడు ప్రభుత్వాలపై విమర్శలు చేస్తూ ట్వీట్లు కూడా పెడుతున్నారు. కొద్దిరోజుల క్రితం కర్ణాటకలో నెలకొన్న రాజకీయ సంక్షోభంపైనా ఆయన మాట్లాడారు. దీంతో పాటు ఈనెల 9న అవినీతిపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తూ ఓ లేఖను విడుదల చేశారు. అధునాతన టెక్నాలజీని ఉపయోగించి అవినీతిని అంతం చేయవచ్చని తెలిపారు.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.