కన్నీళ్లు పెట్టుకున్న YSRCP MLA

Spread the love

వినాయక చవితి సాక్షిగా టీడీపీ నేతల అవమానపు మాటలతో వైసీపీ లేడీ ఎమ్మెల్యే కన్నీళ్లు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. గుంటూరు జిల్లా తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి టీడీపీ నేతలు చేసిన అవమానకర మాటలతో తీవ్ర ఆవేదనకు గురయ్యారు. సోమవారం వినాయకచవితి సందర్భంగా తన నియోజకవర్గంలోని తుళ్లూరు మండలం అనంతవరం గ్రామంలో వినాయకుడి మంటపం పూజల్లో పాల్గొనేందుకు శ్రీదేవి వెళ్లారు.

అయితే అక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు ఆమెను అడ్డుకున్నారు. మండపంలోకి వచ్చి పూజలు చేస్తే వినాయకుడు మైల పడతారని వారు అడ్డుకోవడంతో ఎమ్మెల్యే శ్రీదేవి కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆమెను కులం పేరుతో దూషించడంతో అక్కడున్న వారంతా షాక్ అయ్యారు. ఓ దళిత మహిళా ఎమ్మెల్యేను పట్టుకుని వారు నానా మాటలు అనడంతో ఆమె కన్నీళ్లు ఆగలేదు.

ఈ సంఘటన తర్వాత శ్రీదేవి మీడియాతో మాట్లాడుతూ టీడీపీ నేతలపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. ఎన్నికల్లో టీడీపీని చిత్తుచిత్తుగా ఓడించి ప్రజలు బుద్ధి చెప్పినా ఆ పార్టీ నేతలు మాత్రం తామే అధికారంలో ఉన్నట్టు ఫీలవుతున్నారని తెలిపారు. ఓ దళిత మహిళా ఎమ్మెల్యేను అని చూడకుండా తనను కులం పేరుతో దూషించడం తగదని ఆమె తెలిపారు.

అణగారిన వర్గాల వారు అంటే టీడీపీకి ఎప్పుడూ చిన్నచూపే నన్న ఆమె ఓ మహిళా ఎమ్మెల్యే విషయంలోనే ఇలా ఉంటే సాధారణ ప్రజల విషయంలో ఇంకెలా వ్యవహరిస్తారో ? అని ధ్వజమెత్తారు. దీనిపై న్యాయం పోరాటం చేస్తానని కూడా శ్రీదేవి తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసేందుకు పోలీసులు రెడీ అవుతున్నారు.


Discover more from Telugu Wonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from Telugu Wonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading