ఈ సెప్టెంబర్‌ నుంచి 75 మైక్రాన్ల కంటే
తక్కువ మందమున్న వాటిపై నిషేధం

0
  • వచ్చే ఏడాది జూలై నుంచి అమల్లోకి
  • కేంద్ర పర్యావరణ శాఖ గెజిట్‌ జారీ
  • నిషేధ జాబితాలో ఇయర్‌బడ్స్‌,
  • థర్మాకోల్‌, క్యాండీ, ఐస్‌క్రీమ్‌ స్టిక్స్‌
  • ప్లాస్టిక్‌ కవర్ల వాడకంపైనా ఆంక్షలు
  • ఈ సెప్టెంబర్‌ నుంచి 75 మైక్రాన్ల కంటే
  • తక్కువ మందమున్న వాటిపై నిషేధం
  • 2022 డిసెంబర్‌ నుంచి 120 మైక్రాన్ల మందం ఉన్న కవర్లకే అనుమతి

ప్రతి నిమిషానికి 10 లక్షల వాటర్‌ బాటిళ్లు కొంటున్నారు.

: ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్‌ ( Plastic Ban ) (సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌) వస్తువుల తయారీ, దిగుమతి, నిల్వ, పంపిణీ, అమ్మకం, వినియోగం నిబంధనల్లో కేంద్రప్రభుత్వం మార్పులు చేసింది.

ప్రస్తుతం దేశంలో 50 మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉన్న ప్లాస్టిక్‌ కవర్లపై నిషేధం ఉండగా దానిని 120 మైక్రాన్లకు పెంచింది. తాజా నిబంధనలు వచ్చే ఏడాది జూలై 1 నుంచి అమల్లోకి వస్తాయని కేంద్రపర్యావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు సవరించిన నిబంధనలు శుక్రవారం నోటిఫై చేసింది. ప్లాస్టిక్‌ వ్యర్థాల నిర్వహణ(సవరణ) నిబంధనలు-2021 గెజిట్‌ను జారీచేసింది. దేశంలో ప్లాస్టిక్‌ భూతాన్ని తరిమికొట్టి పర్యావరణాన్ని కాపాడటమే లక్ష్యంగా తాజా నిబంధనలను తీసుకువచ్చారు. ఈ నిబంధనలు అంచెలవారీగా అమలు అవుతాయి.

ఈ సెప్టెంబర్‌ 30 నుంచి 75 మైక్రాన్ల కంటే ఎక్కువ మందం ఉన్న ప్లాస్టిక్‌ కవర్లనే వినియోగించాలి. 2022 జూలై 1 నుంచి ప్లాస్టిక్‌ పుల్లలతో ఉండే ఇయర్‌ బడ్స్‌, బెలూన్లకు ఉండే ప్లాస్టిక్‌ స్టిక్కులు, ప్లాస్టిక్‌ జెండాలు, డెకరేషన్‌ కోసం వినియోగించే పాలీైస్టెరీన్‌ థర్మాకోల్‌, స్ట్రాలు మొదలైన వాటిపై నిషేధం అమల్లోకి వస్తుంది. 2022 డిసెంబర్‌ 31 నుంచి దేశంలో 120 మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉన్న ప్లాస్టిక్‌పై పూర్తి నిషేధం అమలవుతుంది. సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ను వాడొద్దని ప్రధాని మోదీ 2019లో స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం సందర్భంగా పిలుపునిచ్చారు. రెండేండ్ల తర్వాత స్వాతంత్య్ర దినోత్సవానికి మూడు రోజుల ముందు ఈ మేరకు కేంద్రం గెజిట్‌ జారీ చేసింది.

నిషేధం వీటిపైనే
ఇయర్‌ బడ్స్‌, బెలూన్లకు ఉండే ప్లాస్టిక్‌ స్టిక్స్‌, ప్లాస్టిక్‌ జెండాలు, క్యాండీ స్టిక్స్‌, ఐస్‌క్రీమ్‌ స్టిక్స్‌, డెకరేషన్‌ కోసం వాడే థర్మాకోల్‌, ప్లాస్టిక్‌ ప్లేట్లు, కప్పులు, గ్లాసులు, ఫోర్కులు, స్పూన్‌, ప్లాస్టిక్‌ కత్తులు, స్ట్రాలు, ట్రేతోపాటు స్వీట్‌ బాక్సులు, ఇన్విటేషన్‌ కార్డులు, సిగరెట్‌ ప్యాకెట్ల ప్యాకింగ్‌కు వాడే ఫిల్మ్స్‌, పీవీసీ బ్యానర్లు(100 మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉన్నవి)
ఏటా 30 కోట్ల టన్నుల ప్లాస్టిక్‌ ఉత్పత్తి అవుతున్నది. ఇది మానవ జనాభాకు సమానం.

భారత్‌లో ఏటా 33 లక్షల టన్నుల వ్యర్థాలు
2018-19లో భారత్‌లో 33 లక్షల టన్నుల ప్లాస్టిక్‌ వ్యర్థాలు పోగయ్యాయి. అంటే రోజుకు 9,200 టన్నులు. గోవాలో అత్యధికంగా ఒక్కరు రోజుకు సగటున 60 గ్రాముల ప్లాస్టిక్‌ వాడతున్నారు. కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు ఈ వివరాలను వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా 1950 నుంచి ప్లాస్టిక్‌ ఉత్పత్తి విపరీతంగా పెరిగింది. ఇప్పటివరకు 830 కోట్ల టన్నుల ప్లాస్టిక్‌ ఉత్పత్తి అయింది. 2050 నాటికి ప్రపంచ చమురు వినియోగంలో 20శాతం ప్లాస్టిక్‌ పరిశ్రమలకే మళ్లించాల్సి ఉంటుందని ఐరాస గతంలో ఆందోళన వ్యక్తం చేసింది. ఐక్యరాజ్య సమితి గణాంకాల ప్రకారం ఏటా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 5 లక్షల కోట్ల టన్నుల సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ బ్యాగ్‌లను ఉపయోగిస్తున్నారు. మొత్తం ప్లాస్టిక్‌లో కేవలం 9శాతం మాత్రమే రీసైకిల్‌ అవుతున్నది. ప్లాస్టిక్‌ బ్యాగులు భూమిలో కలిసిపోవడానికి వెయ్యేండ్లు పడుతుంది. ప్లాస్టిక్‌ వ్యర్థాల్లో ైస్టెరీన్‌, బెంజీన్‌ లాంటి విషపూరిత రసాయనాలు ఉంటాయి. ఇవి క్యాన్సర్‌ ముప్పును పెంచుతాయి.

Leave a Reply