ఒకవైపు వాన, మరోవైపు ఎండ.. ఏపీలో తాజాగా చిత్ర విచిత్రమైన వాతావరణం నెలకొంది. వచ్చే 3 రోజులు పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ చెప్పగా.. అటు కొన్ని చోట్ల ఎండలు కూడా ఠారెత్తిస్తాయని హెచ్చరిస్తున్నారు.
ఏపీలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు చోటు చేసుకున్నాయి. రాష్ట్రంలోని పలు చోట్ల రానున్న మూడు రోజుల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉండగా.. మరికొన్ని ప్రాంతాల్లో ఎండలు దంచికోడుతున్నాయి. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. బుధవారం అనకాపల్లి(D) మాడుగుల 39.4°C, వైఎస్సార్(D) దువ్వూరులో 38.9°C, నంద్యాల జిల్లా కొత్తపల్లిలో 38.7°C, ఎన్టీఆర్ జిల్లా కొండపల్లిలో 38.6°C, పల్నాడు జిల్లా అమరావతి, పార్వతీపురంమన్యం జియ్యమ్మవలసలో 38.3°C, అన్నమయ్య జిల్లా వతలూరులో 38.2°C, గుంటూరు జిల్లా తాడేపల్లి, విజయనగరం జిల్లా నెలివాడ 38.1°C అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
మరోవైపు గురువారం అల్లూరిసీతారామరాజు, ప్రకాశం, రాయలసీమ జిల్లాల్లో చెదురుమదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక శుక్రవారం రాయలసీమ, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురంమన్యం జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందట. అలాగే శుక్రవారం శ్రీకాకుళం జిల్లా-6, విజయనగరం జిల్లా-5, పార్వతీపురంమన్యం జిల్లా-7, అల్లూరి సీతారామరాజు జిల్లా-3, తూర్పుగోదావరి-2 మండలాల్లో(23) వడగాలులు ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.