తిరుమల శ్రీవారి సేవలో చంద్రబాబు కుటుంబం.. రూ.44 లక్షలు విరాళం.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కుటుంబం తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. మనవడు నారా దేవాన్ష్ పుట్టినరోజు పురస్కరించుకుని సతీమణి నారా భువనేశ్వరి, కుమారుడు నారా లోకేష్, కోడలు నారా బ్రాహ్మణితో కలిసి శ్రీవారి సేవలో పాల్గొన్నారు. అనంతరం రంగనాయకులు మండపంలో ఆలయ పండితులు వేద ఆశీర్వచనాలు అందించగా.. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో జే శ్యామలరావులు స్వామివారి తీర్థ ప్రసాదాలు, చిత్రపటాన్ని, శ్రీవారి శేషవస్త్రాన్ని అందజేశారు. అంతకముందు సామాన్య భక్తుల్లా చంద్రబాబు కుటుంబం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ గుండా ఆలయంలోకి ప్రవేశించారు. క్యూ కాంప్లెక్స్ వద్ద చంద్రబాబుకు టీటీడీ ఈవో శ్యామలరావు స్వాగతం పలికారు. ఆలయ మహా ద్వారం వద్ద చేరుకున్న చంద్రబాబుకు శ్రీవారి ఆలయ అర్చకులు, ఈవో శ్యామలరావు, అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరిలు ఇస్తికఫల్ స్వాగతం పలికారు. అనంతరం చంద్రబాబు ధ్వజస్తంభాన్ని స్పృశించి, నమస్కరించి ఆలయ ప్రవేశం చేశారు.

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం.. చంద్రబాబు కుటుంబం తరిగొండ వెంగమాంబ సత్రంలో నారా దేవాన్ష్ పుట్టిన రోజును పురస్కరించుకుని అన్నదానం నిర్వహించారు. చంద్రబాబు, మనవడు దేవాన్ష్ కుటుంబ సభ్యులు భువనేశ్వరి, లోకేష్, బ్రాహ్మణిలతో కలిసి స్వయంగా భక్తులకు ప్రసాదాలు వడ్డించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మధ్యాహ్నం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల నుంచి బయలుదేరి హైదరాబాద్‌ చేరుకుంటారు. నారా దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబం టీటీడీ ఎస్వీ అన్నప్రసాదం ట్రస్ట్‌కు రూ.44లక్షలు విరాళంగా అందజేసింది. అంటే మార్చి 21న తిరుమలలో అన్నప్రసాదం మొత్తానికి అయ్యే వ్యయాన్ని అందజేశారు. నారా దేవాన్ష్ మొదటి పుట్టిన రోజు నుంచి చంద్రబాబు కుటుంబం రూ.44 లక్షలు అన్నప్రసాదం కోసం విరాళంగా అందజేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది కూడా ఆ ఆనవాయితీని కొనసాగించారు.. విరాళాన్ని అందజేశారు.

Discover more from Telugu Wonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from Telugu Wonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading