త్వరలో తెలంగాణలో ఉప ఎన్నికలు జరగబోతున్నాయా..? స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి దీనికి సంబంధించి సంకేతాలు ఇచ్చారా..? అయితే నేడు స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో జరిగిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి దీని గురించి సంకేతాలు ఇచ్చారు. రూ. 800 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి.. శివునిపల్లి వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఇక్కడకు తాను వచ్చింది త్వరలో జరగబోయే ఎన్నికల్లో ఓట్లు అడగడానికో.. ఓట్లు వేయడానికో కాదు అంటూ.. పరోక్షంగా ఎన్నికల గురించి ప్రస్తావించారు.
ఇదిలా ఉండగా.. గతంలో కొన్ని కార్యక్రమాల్లో.. స్టేషన్ ఘన్పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిందని.. గడిచిన 14 నెలలు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణకు ఏమి చేసింది లేదని అన్నారు. స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధి మాత్రమే కనిపిస్తుందన్నారు. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన కడియం శ్రీహరికి ఏమైనా రాజ్యాంగ విలువలు ఉంటే.. వెంటనే రాజీనామా చేసి.. ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి నీతి నిజాయితీ నిరూపించుకోవాలన్నారు. అంతేకాకుండా.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ కూడా చాలా సార్లు ఉప ఎన్నికల గురించి ప్రస్తావించారు. బీఆర్ఎస్ నుంచి గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారు రాజీనామా చేసి కాంగ్రెస్ నుంచి గెలవాలని సవాల్ విసిరారు.
రాష్ట్రంలో కచ్చితంగా ఉప ఎన్నికలు వస్తాయని.. పార్టీ మారిన 10 నియోజకవర్గాల్లో ఈ ఎన్నికలు ఉంటాయన్నారు. మాకు ఆ పది నియోజకవర్గాల్లో అనేకమంది పోటీకి సిద్ధంగా ఉన్నారని చెప్పుకొస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలపై వేటు పడక తప్పదన్నారు. దీనిపై వారు న్యాయస్థానాల్లో కూడా పోరాడుతున్నారు. ఇలా.. పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో కొద్ది రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూడా ఇటీవల దీనిపై మాట్లాడారు. పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో కోర్టు తీర్పు ఎలా వచ్చినప్పటికీ శిరసా వహిస్తానని పేర్కొన్నారు.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.