రాజకీయాలకు గుడ్ బై.. సినిమాల్లోకి పవన్ రీ ఎంట్రీ? కేసు పెడతామంటోన్న జనసేన
Teluguwonders:
ప్రముఖ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ రాజకీయ కేరీర్ పై సోషల్ మీడియాలో పుకార్లు చెలరేగుతున్నాయి. మొన్నటి అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో పార్టీ దారుణ పరాజయం పాలుకావడాన్ని భరించలేక ఆయన రాజకీయాలకు పుల్ స్టాప్ పెట్టబోతున్నారని, త్వరలో సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నారనేది ఆ పుకార్ల సారాంశం. జనసేన పార్టీ మీడియాకు విడుదల చేసే పత్రికా ప్రకటన రూపంలో అది వెలువడింది. జనసేన పార్టీ పేరు, లోగో, పవన్ కల్యాణ్ సంతకం ఉండటంతో ఆ పత్రికా ప్రకటన సంచలనంగా మారింది. సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.
ఆ వార్తను జనసేన పార్టీ తోసి పుచ్చింది. అవి పుకార్లు మాత్రమేనని, వాటిని నమ్మొద్దని సూచించింది.ఈ మేరకు పవన్ కల్యాణ్ రాజకీయ కార్యదర్శి పీ హరిప్రసాద్ ఓ ప్రకటన విడుదల చేశారు. తప్పుడు లేఖను సృష్టించిన వారిపై కేసు పెడతామని, న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
మొన్నటి అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో జనసేన పార్టీ ఓటమి పాలైన విషయం తెలిసిందే. ఆ పార్టీ సొంతంగా 139 అసెంబ్లీ, 21 లోక్ సభ స్థానాల్లో పోటీ చేసింది. అసెంబ్లీలో ఒకే ఒక్క స్థానాన్ని గెలుచుకోగలిగింది. ఈ ఫలితాలను తనను తీవ్రంగా నిరాశకు గురి చేశాయని, వ్యక్తిగతంగా తాను పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ ఓడిపోవడం పార్టీ అధ్యక్షుడిగా ప్రజలు తనను తిరస్కరించినట్టయిందని పవన్ కల్యాణ్ వెల్లడించినట్లు ఆ లేఖలో పేర్కొన్నారు. పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి, సినిమాల్లో నటిస్తానని అంటూ పవన్ కల్యాణ్ పేరు మీద ఈ లేఖ సోషల్ మీడియాలో పోస్ట్ అయింది. వైరల్ గా మారింది.
ఈ విషయం జనసేన పార్టీ అగ్ర నాయకత్వం దృష్టికి చేరింది. ఈ వార్తపై స్పష్టమైన వివరణ ఇస్తూ హరిప్రసాద్ ఓ ప్రకటన విడుదల చేశారు. రాజకీయాల్లో పవన్ కల్యాణ్ ఎదుగుదలను చూసిన కొందరు ఓర్వలేక ఇలాంటి తప్పుడు లేఖను సృషించారని అన్నారు. వాటిని విశ్వసించవద్దని కోరారు. రాజకీయాలను వదులుకుని సినిమాల్లో నటిస్తారనే విషయం తమ దృష్టికి వచ్చిందని, అదంతా కట్టుకథ అని అన్నారు. మోసపూరితంగా ఆ ప్రకటన విడుదల చేశారని విమర్శించారు. తప్పుడు లేఖను సృష్టించి, దాన్ని షేర్ చేస్తోన్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాజకీయాల్లో గెలుపోటములు అత్యంత సహజమని, తమ నాయకుడు నిరంతరం ప్రజలకు చేరువగా ఉంటూ, వారి తరఫున పోరాటాలు సాగించడమే తన బాధ్యతగా పవన్ కల్యాణ్ నమ్ముతున్నారని చెప్పారు.