GST: అమల్లోకి జీఎస్టీ.. తక్కువ ధరకు వస్తువులు అమ్మకపోతే.. ఇక్కడ ఫిర్యాదు చేయండి.. తక్షణ చర్యలు

దసరా నవరాత్రుల కానుకగా ప్రభుత్వం కొన్ని రకాల వస్తువులపై జీఎస్టీ తగ్గింపుని ఇచ్చింది. ఇది సోమవారం నుంచి అమలులోకి వచ్చింది. అయినా దుకాణదారులు తక్కువ ధరలకు వస్తువులను అందించడం లేదనే వార్తలు వినిపిస్తున్న నేపధ్యంలో ప్రభుత్వం చర్యలు తీసుకోవడం మొదలు పెట్టింది. GST అమలులోకి వచ్చినప్పటికీ దుకాణదారుడు తక్కువ ధరలకు వస్తువులను అందించకపోతే.. వినియోగదారులు ఫిర్యాదు చేయవచ్చు. టోల్-ఫ్రీ నంబర్ 1915 కు కాల్ చేయవచ్చు లేదా 8800001915 కు WhatsApp/SMS పంపించవచ్చు. నేషనల్ కన్స్యూమర్ హెల్ప్లైన్ లేదా UMANG యాప్ ద్వారా కూడా ఫిర్యాదులు చేయవచ్చు.
సెప్టెంబర్ 22 నుంచి దేశవ్యాప్తంగా కొత్త GST రేట్లు అమల్లోకి వచ్చాయి. సాధారణ ప్రజలకు ప్రయోజనం చేకూర్చేందుకు ప్రభుత్వం అనేక వస్తువులపై పన్నులను తగ్గించింది. వినియోగదారులు వస్తువు వాస్తవ ధరను అర్థం చేసుకునేలా పాత స్టాక్పై కొత్త రేట్లతో స్టిక్కర్లను అతికించాలని కంపెనీలకు స్పష్టంగా సూచన చేశారు.
ఒకే వస్తువుపై రెండు MRP లను చూడవచ్చు.
కొత్త GST రేట్లు అమలులోకి రావడంతో ఇప్పుడు మార్కెట్లో ఒకే వస్తువుకు రెండు వేర్వేరు ధరల MRP కనిపిస్తుంది. ఒకటి పాత ధర, మరొకటి కొత్త ధర. కనుక మీరు కొత్త GST రేటు ప్రకారం మాత్రమే సరైన ధరను చెల్లించాలి. కనుక ఏదైనా వస్తువును కొనుగోలు చేసేటప్పుడు.. ఉత్పత్తి కొత్త MRP ఉందో లేదో నిర్ధారించుకోవాలి.
అయితే చిన్న దుకాణదారులు పాత ధరకే వస్తువులను అమ్ముతారు. అప్పుడు వినియోగదారులు పన్ను మినహాయింపు పొందలేరు. అలాంటి సందర్భాలలో వినియోగదారులు మౌనంగా ఉండకూడదు.. నేరుగా ఫిర్యాదు చేయాలి. మీరు మీ హక్కుని పొందేలా ఫిర్యాదు కూడా చేయవచ్చు. ఈ మేరకు ప్రభుత్వం సులభమైన పద్ధతులను ఏర్పాటు చేసింది.
ఎక్కడ? ఎలా ఫిర్యాదు చేయాలి?
GST తగ్గింపు ఉన్నప్పటికీ ఒక దుకాణదారుడు వస్తువులను తప్పుడు ధరకు అమ్మినా లేదా ఎక్కువ వసూలు చేసినా.. చాల సింపుల్ గా చేయవచ్చు, అది కూడా ఉచితంగా. మీరు ప్రభుత్వ వెబ్సైట్ consumerhelpline.gov.in ని సందర్శించి ఫిర్యాదు చేయవచ్చు. ముందుగా ఈ వెబ్సైట్లో మీ పేరు, ఫోన్ నెంబర్ నమోదు చేసుకోవాలి.. తర్వాత OTPతో లాగిన్ అయి ఫిర్యాదు పూర్తి వివరాలను పూరించాలి. తర్వాత బిల్లులు, కొన్న వస్తువుల ఫోటోలు వంటి సంబంధిత పత్రాలను అప్లోడ్ చేయాలి.
ఒకవేళ వెబ్సైట్ను ఉపయోగించడంలో ఎవరికైనా ఇబ్బంది ఉంటే.. టోల్-ఫ్రీ నంబర్ 1915 కు కాల్ చేసి తద్వారా ఫిర్యాదు చేయవచ్చు. మొబైల్ నంబర్ 8800001915 కు వాట్సాప్ లేదా SMS కూడా చేయవచ్చు. నేషనల్ కన్స్యూమర్ హెల్ప్లైన్ యాప్ లేదా ఉమాంగ్ యాప్ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చు. వీటి ద్వారా వినియోగదారులు చేసే ఫిర్యాదులు నేరుగా ప్రభుత్వానికి చేరుతాయి. వెంటనే పరిష్కరించబడతాయి.
ఉత్పత్తి సరైన ధరను ఎలా తెలుసుకోవాలంటే
GST రేటు తగ్గించిన తర్వాత కూడా.. దుకాణదారులు అదే అధిక ధరను వసూలు చేస్తుంటే.. అసలు ధర ఏమిటనే విషయంపై వినియోగదారులు గందరగోళానికి గురవుతారు. ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం savingwithgst.in అనే ప్రత్యేక వెబ్సైట్ను ప్రారంభించింది. ఇక్కడ వినియోగదారుడు ఏదైనా ఉత్పత్తి పేరును నమోదు చేసి.. తద్వారా GST రేటు తగ్గింపు తర్వాత దాని అసలు ధరను చూడవచ్చు. GST రేట్లలో ఏదైనా తగ్గింపు వినియోగదారులకు ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూర్చాలని ప్రభుత్వం స్పష్టంగా పేర్కొంది.
Discover more from TeluguWonders
Subscribe to get the latest posts sent to your email.
