ఖరీదైన ఫోన్ అవసరమా? అని నిలదీసిన భార్యను కొట్టిచంపిన భర్త

0

ఖరీదైన సెల్‌ఫోన్ కొన్నందుకు వ్యతిరేకించిన భార్యను ఓ వ్యక్తి దారుణంగా కొట్టి చంపేసిన ఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది. ఆర్థిక పరిస్థితులు బాగోలేనప్పుడు కొత్త ఫోన్ ఎందుకు అని అడిగినందుకు చావగొట్టి ప్రాణం తీశాడు.

ఖరీదైన సెల్‌ఫోన్ కొన్నందుకు మందలించిన భార్యను కిరాతకంగా చంపేశాడో దుర్మార్గుడు. మధ్యప్రదేశ్‌లోని ఖర్గోనె జిల్లా డామ్‌వాడా గ్రామానికి చెందిన భోలారం అనే వ్యక్తి, భార్య నందుబాయి, ముగ్గురు పిల్లలున్నారు. పేద కుటుంబం కావడంతో ఏ రోజు కూలీ ఆరోజే కుటుంబ పోషణకు సరిపోతోంది.
ఈ నేపథ్యంలోనే భోలారం మూడ్రోజుల క్రితం ఖరీదైన సెల్‌ఫోన్ కొని ఇంటికి తెచ్చాడు. అది చూసిన భార్య ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న సమయంలో సెల్‌ఫోన్ అవసరమా? అని భర్తను మందలించింది. ఇదే విషయమై దంపతుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో భోలారం ఆగ్రహంతో నందుబాయిని కర్రతో తలపై తీవ్రంగా కొట్టాడు. తీవ్ర రక్తస్రావంతో ఆమె అక్కడికక్కడే కూలిపోవడంతో పరారయ్యాడు.

నందుబాయి ముగ్గురు పిల్లలు ఇంట్లో నుంచి ఏడుస్తూ బయటకు వచ్చి విషయాన్ని స్థానికులకు చెప్పడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. రక్తపు మడుగులో పడివున్న నందుబాయిని చూసిన చుట్టపక్కల వాళ్లు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారు అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు. భోలారంపై హత్య కేసు నమోదు చేసి అతడి కోసం గాలిస్తున్నారు.

Leave a Reply