అక్కినేని నాగార్జున పొలంలో అనుమానాస్పద మృతదేహం

Suspicious dead body at Akkineni Nagarjuna farm
Spread the love

Teluguwonders:

నటుడు నాగార్జునకు చెందిన వ్యవసాయ క్షేత్రంలో మృతదేహం కనిపించడం కలకలానికి కారణమైన సంగతి తెలిసిందే. ఆ మృతదేహం ఎవరిది? హత్యా? ఆత్మహత్యా? అనే సందేహాలు తలెత్తిన సమయంలో పోలీసులు కేసు దర్యాప్తు చేసి 24 గంటలలోగా చేధించారు. మూడేళ్ల కిందట జరిగిన ఘటనగా తేల్చారు.

👉రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం పాపిరెడ్డిగూడ శివారులో ‘ఎన్‌’ ఆగ్రో ఫాంకు చెందిన 40 ఎకరాల పొలం ఉంది. ఇది టాలీవుడ్ హీరో నాగార్జునకు చెందినది. బుధవారం (సెప్టెంబర్ 18) ఈ వ్యవసాయ క్షేత్రంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. ఆ మృతదేహం పూర్తిగా కుళ్లిపోయి ఎముకలు మాత్రమే మిగలడం గమనార్హం.

హరితహారం కార్యక్రమంలో భాగంగా ఎన్‌ ఆగ్రో ఫాం పొలంలో పనులు చేస్తున్న వారికి ఈ శవం కనిపించింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. శంషాబాద్‌ డీసీపీ ప్రకాశ్‌ రెడ్డి కూడా అక్కడికి వచ్చి విచారణ చేపట్టారు. మృతదేహం సమీపంలో లభించిన విష గుళికల ఆధారంగా బాధితుడు ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఆ కోణంలో దర్యాప్తు చేయగా అసలు కథ బయటకు వచ్చింది.

🔴వివరాల్లోకి వెళ్తే :

పాపిరెడ్డిగూడకు చెందిన చాకలి జంగమ్మ, అంజయ్య దంపతులకు నలుగురు కుమారులు. చిన్న కుమారుడు పాండు (30) మూడో కుమారుడు కుమార్‌తో చాలా చనువుగా ఉండేవాడు. ఒకరంటే మరొకరికి ప్రాణం. అయితే.. 2016లో కుమార్ కిడ్నీ సంబంధిత రుగ్మతతో మరణించాడు. అన్న మరణంతో పాండు కుమిలిపోయాడు.

🔴సోదరుడి మరణంతో ఆత్మహత్య లేఖ రాసి:

సోదరుడి మరణంతో జీవితంపై విరక్తి చెందిన పాండు.. తానూ చనిపోతానని తరచూ కుటుంబ సభ్యులతో, స్నేహితులతో చెప్పేవాడు. 2016 డిసెంబర్‌లో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఓ లేఖ రాసి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి కనిపించకుండాపోయాడు.
👉తాజాగా ఎన్‌ ఆగ్రోఫాం పొలంలో పనులు చేస్తున్న వారికి పాండు మృతదేహం కనిపించింది. ఎముకల గూడుకు చొక్కా, ప్యాంటు తొడిగినట్లుగా ఆ మృతదేహం ఉంది. ఆ పక్కనే విష గుళికలకు సంబంధించిన సీసా లభించింది. మృతదేహం వద్ద లభించిన ఆధార్‌ కార్డు ఆధారంగా పోలీసులు అతడిని పాండుగా గుర్తించారు.

పాండు కనిపించకుండా పోవడానికే ముందే ఆ కుటుంబానికి చెందిన భూమిని అమ్మకానికి పెట్టారు. పాండు వంతు రూ.19 లక్షలు వచ్చాయి. తన వంతుగా వచ్చే డబ్బులను అమ్మ పేరు మీద పెట్టాలని.. తాను చనిపోయాక అన్న ఫొటో పక్కన తన ఫొటో ఉంచాలని సూసైడ్‌ నోట్‌లో పాండు రాసిపెట్టాడు.

🔴 వెలుగులోకి ఎందుకు రాలేదు? 

పాండు అదృశ్యంపై కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. దీంతో అతడిని వెతికే ప్రయత్నాలు జరగలేదు. పాండు ఎక్కడికో వెళ్లిపోయి ఆత్మహత్య చేసుకొని మరణించి ఉంటాడని కుటుంబ సభ్యులు భావించారు. ఏళ్లు గడవడంతో ఈ విషయం మరుగున పడిపోయింది. కానీ మృత దేహం దొరికినతర్వాత వేలికి ఉంగరం, మెడలోని గొలుసు, కర్చీఫ్, చెప్పులను బట్టి అతడిని పాండుగా కుటుంబ సభ్యులు ధ్రువీకరించారు.

💥మిస్టరీ వీడింది :

మొత్తానికి Nagarjuna వ్యవసాయ క్షేత్రంలో లభ్యమైన మృతదేహం మిస్టరీ వీడింది. ఇది మూడేళ్ల కిందట జరిగిన ఘటనగా పోలీసులు గుర్తించారు.


Discover more from Telugu Wonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from Telugu Wonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading