దక్షిణాఫ్రికాని టెస్టు సిరీస్‌లో భారత్ 3-0తో క్లీన్‌స్వీప్..!

Spread the love

దక్షిణాఫ్రికాని టెస్టు సిరీస్‌లో భారత్ క్లీన్‌స్వీప్ చేసేసింది. వైజాగ్, పుణె టెస్టులో అలవోక విజయాల్ని అందుకున్న టీమిండియా.. రాంచీ టెస్టులోనూ ఇన్నింగ్స్, 202 పరుగుల తేడాతో గెలిచింది.

  • రాంచీ టెస్టులో ఇన్నింగ్స్, 202 పరుగుల తేడాతో గెలిచిన భారత్
  • మూడు టెస్టుల సిరీస్‌ని 3-0తో కోహ్లీసేన కైవసం
  • ఈ మ్యాచ్‌తో భారత్ గడ్డపై ముగిసిన దక్షిణాఫ్రికా పర్యటన
  • రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 104.2 ఓవర్లు బ్యాటింగ్ చేసిన సఫారీలు
  • భారత్ ఒక్క ఇన్నింగ్స్‌లోనే 116.3 ఓవర్లు బ్యాటింగ్
భారత్ గడ్డపై టెస్టుల్లో తమకి తిరుగులేదని టీమిండియా మరోసారి నిరూపించుకుంది. దక్షిణాఫ్రికాతో రాంచీ వేదికగా మంగళవారం ముగిసిన మూడో టెస్టు మ్యాచ్‌లో ఇన్నింగ్స్, 202 పరుగుల తేడాతో విజయం సాధించిన భారత్.. 3-0తో సిరీస్‌ని చేజిక్కించుకుంది. ఇండియాలో 2012 నుంచి టెస్టుల్లో జైత్రయాత్ర సాగిస్తున్న భారత్ జట్టుకి ఇది వరుసగా 11వ టెస్టు సిరీస్ విజయం కావడం విశేషం. విశాఖపట్నంలో జరిగిన తొలి టెస్టులో 203 పరుగుల తేడాతో గెలిచిన టీమిండియా.. పుణె టెస్టులో ఇన్నింగ్స్, 137 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ గెలుపొందడం ద్వారా 120 పాయింట్లని ఖాతాలో వేసుకున్న భారత్ జట్టు మొత్తం 240 పాయింట్లతో ఐసీసీ టెస్టు ఛాంపియన్‌‌షిప్‌లో అగ్రస్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంది.
రాంచీ టెస్టు ఆటలో నాలుగో రోజైన మంగళవారం ఓవర్‌నైట్ స్కోరు 132/8తో రెండో ఇన్నింగ్స్‌ని కొనసాగించిన దక్షిణాఫ్రికా 133 పరుగులకే కుప్పకూలిపోయింది. ఈరోజు తొలి సెషన్ రెండో ఓవర్‌లోనే వరుస బంతుల్లో డిబ్రయిన్ (30: 49 బంతుల్లో 4×4, 1×6), లుంగి ఎంగిడి (0) వికెట్లను స్పిన్నర్ నదీమ్ పడగొట్టేశాడు. దీంతో.. సఫారీల రెండో ఇన్నింగ్స్‌తో పాటు భారత్ గడ్డపై వారి పర్యటన కూడా ముగిసింది. భారత బౌలర్లలో రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి.. మహ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్ ఐదేసి వికెట్లు పడగొట్టగా.. నదీమ్ నాలుగు, జడేజా మూడు, అశ్విన్ ఒక వికెట్ తీశారు. కగిసో రబాడ, జార్జ్ లిండే రనౌట్‌గా వెనుదిరిగారు.
శనివారం ఆరంభమైన రాంచీ టెస్టులో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు.. ఓపెనర్ రోహిత్ శర్మ (212: 255 బంతుల్లో 28×4, 6×6) డబుల్ సెంచరీ, అజింక్య రహానె (115: 192 బంతుల్లో 17×4, 1×6) శతకం బాదడంతో తొలి ఇన్నింగ్స్‌ని 497/9 వద్ద డిక్లేర్ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా బౌలర్లు జార్జ్ లిండే నాలుగు వికెట్లు పడగొట్టగా.. కగిసో రబాడ మూడు తీశాడు.

Discover more from Telugu Wonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from Telugu Wonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading