రేవంత్ రెడ్డికి ఫోన్ చేసిన పవన్ కళ్యాణ్
Teluguwonders:
తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్కు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫోన్ చేశారు. యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా కలిసి పోరాడదామని పిలుపు ఇచ్చారు.
నల్లమలలో యురేనియం తవ్వకాలను చేపట్టాలనే ప్రభుత్వ నిర్ణయం తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. విపక్ష నేతలతో పాటు పలువురు నిపుణులు, పర్యావరణవేత్తలు దీన్ని వ్యతిరేకిస్తున్నారు.
👉 వివరాల్లోకి వెళ్తే :
నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా అందరూ ఏకం కావాల్సిన అవసరం ఉందని ఎంపీ రేవంత్ రెడ్డి ఇటీవల పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను ట్యాగ్ చేస్తూ మంగళవారం (సెప్టెంబర్ 10) ఆయన ఓ ట్వీట్ చేశారు. రాష్ట్రానికి ఊపిరి లాంటి నల్లమలను కాపాడుకుందామని పిలుపునిచ్చారు.
నల్లమలలో యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా తెలంగాణ కాంగ్రెస్ పోరాటానికి సిద్ధమైంది. పార్టీ సీనియర్ నేత వి హనుమంత రావు (వీహెచ్) నేతృత్వంలో ఓ కమిటీని నియమించింది. యురేనియం తవ్వకాల అంశంపై వీహెచ్ సోమవారం జనసేన కార్యాలయంలో ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్తో భేటీ అయ్యారు. పోరాటానికి మద్దతు ఇవ్వాలని కోరగా.. పవన్ సానుకూలంగా స్పందించారు.
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫోన్ చేశారు. యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా కలిసి పోరాటం చేద్దామని తెలిపారు. యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా సోమవారం (సెప్టెంబర్ 16) ఉదయం 10 గంటలకు హైదరాబాద్లోని దస్పల్లా హోటల్లో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి రావాల్సిందిగా రేవంత్ను పవన్ ఆహ్వానించారు. దీనికి రేవంత్ సానుకూలంగా స్పందించారు. కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు నేతృత్వంలో ఈ సమావేశం జరగనుంది.
🔴యురేనియం తవ్వకాలతో పొంచి ఉన్న ప్రమాదం :
యురేనియం వల్ల క్యాన్సర్, మూత్రపిండ సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. కృష్ణా జలాలు కలుషితమవుతాయని.. తెలుగు రాష్ట్రాల ప్రజలకు ముప్పు ఉంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు .. నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలతో పర్యావరణానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని.. జీవవైవిధ్యం నాశనమవుతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.