ఏప్రిల్ 7 నుంచే టెన్త్ పబ్లిక్ పరీక్షల సమాధాన పత్రాల మూల్యంకనం.. ఫలితాలు ఎప్పుడంటే?

రెండు తెలుగు రాష్ట్రాల్లో విద్యార్ధులకు పరీక్షలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఏపీలో ఇప్పటికే పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభమవగా.. తెలంగాణలో మార్చి 21వ తేదీ నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లు కూడా ఇప్పటికే పాఠశాల విద్యాశాఖ జారీ చేసింది..
హైదరాబాద్, మార్చి 18: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 21వ తేదీ నుంచి ప్రారంభంకానున్న సంగత తెలిసిందే. ఈ పరీక్షకు సంబంధించిన పదో తరగతి హాల్ టికెట్లను కూడా ఇప్పటికే పాఠశాల విద్యాశాఖ అధికారిక వెబ్సైట్లో అందుబాటులోకి తీసుకు వచ్చింది. పరీక్షలకు హాజరయ్యే విద్యార్ధులు వాటిని నేరుగా డౌన్లోడ్ చేసుకోవచ్చని ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు ఎ కృష్ణా రావు ఇప్పటికే ప్రకటన జారీ చేశారు కూడా. ఇక పరీక్షలు మార్చి 21 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఆయా తేదీల్లో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఈ పరీక్షలు జరుగుతాయి.
ఇక టెన్త్ పబ్లిక్ పరీక్షల నిర్వహణ అనంతరం పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం ఏప్రిల్ 7 నుంచి 15వ తేదీ వరకు జరగనుంది. ఈ మేరకు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు కృష్ణారావు శనివారం (మార్చి15న) ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 19 చోట్ల ఈ మూల్యాంకనం ప్రక్రియ జరగనుంది. పదో తరగతి పరీక్షలు ముగిసిన వెంటనే మూల్యంకనం ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తుంది. మూల్యాంకనం అనంతరం మరో పది రోజుల్లోనే విద్యార్ధులకు ఫలితాలను ప్రకటిస్తారు.
పదో తరగతి పరీక్షలకు సంబంధించి ఏమైనా సమస్యలు, సందేహాలుంటే 040-23230942 అనే ఫోన్ నంబరుకు ఫోన్ చేసి చెప్పాలని, అందుకు ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశామని ఆయన అన్నారు. కాగా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 11,544 పాఠశాలలు ఉండగా.. వీటిల్లో దాదాపు 4.97 లక్షల మంది విద్యార్థులు ఈ ఏడాది పదో తరగతి పరీక్షలు రాయనున్నారు. పరీక్షల నిర్వహణకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2,500 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. విద్యార్థులు చదువుతున్న పాఠశాలలకు సమీపంలోనే పరీక్ష కేంద్రాలుంటాయని, కంగారు పడాల్సిన అవసరం లేదని అధికారులు తెలిపారు.
Discover more from TeluguWonders
Subscribe to get the latest posts sent to your email.
