February 26, 2026

బీడీ కార్మికుల సమస్యపై కేంద్ర మంత్రి నిర్మలకు హరీశ్ రావు వినతి

Teluguwonders:

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో మంత్రి హరీశ్ రావు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. బీడీ కార్మికుల సమస్యపై ప్రధానంగా చర్చించారు. కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు.

తెలంగాణ రాష్ట్రంలో లక్షలాది మంది పేద మహిళలు ఆధారపడే బీడీ తయారీ పరిశ్రమపై జీఎస్టీ ఎత్తివేయాలని రాష్ట్ర ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్ రావు.. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ను కోరారు. శుక్రవారం (సెప్టెంబర్ 20) గోవాలో జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశానికి హాజరైన హరీశ్ రావు.. ఈ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాష్ట్రంలో బీడీ కార్మికులు ఎదుర్కొంటున్న ఆరోగ్య, ఆర్థిక ఇబ్బందుల గురించి నిర్మలా సీతారామన్‌కు వివరించారు.

💥మంత్రి హరీశ్ రావ్ వివరాల ప్రకారం :

తెలంగాణ రాష్ట్రంలో 1000 బీడీ తయారీ యూనిట్లు ఉన్నాయని.. వీటిలో 5 లక్షల మంది కార్మికులు పని చేస్తున్నారని హరీశ్ తెలిపారు. వీరిలో 90 శాతానికి పైగా పేద మహిళలే ఉన్నారని చెప్పారు. బీడీలు చుట్టడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుందని తెలిసినప్పటికీ.. జీవనోపాధి కోసం ఆ పని చేయకతప్పడం లేదని వివరించారు.
బీడీ కార్మికులను ఆదుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేనివిధంగా ఒక్కొక్కరికీ నెలకు రూ.2016 చొప్పున ఆసరా పింఛన్ అందిస్తోందని తెలిపారు. అయితే.. కేంద్ర ప్రభుత్వం బీడీ పరిశ్రమను, బీడీల తయారీని, బీడీ ఆకుల వ్యాపారాన్ని జీఎస్టీ పరిధిలోకి తెచ్చి భారీగా పన్నులు విధించడం వల్ల ఈ రంగంపై ఆధారపడిన వారిపై ప్రభావం పడుతోందని కేంద్ర మంత్రికి వివరించారు.
బీడీ వ్యాపారంపై పడే ప్రభావం లక్షలాది మంది మహిళల జీవితాలతో ముడిపడి ఉందని హరీశ్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం బీడీలపై 28 శాతం, బీడీ ఆకులపై 18 శాతం జీఎస్టీ ఉందని తెలిపారు. ఇంత మొత్తంలో బీడీలపై పన్నులు ఉండటం వల్ల పరిశ్రమ దెబ్బతినే ప్రమాదం ఉందని చెప్పారు. మహిళల ఆర్థిక పరిస్థితులతో సంబంధం కలిగిన అంశం కాబట్టి సానుకూల దృక్పథంతో బీడీలపై జీఎస్టీని ఉపసంహరించాలని కేంద్ర మంత్రిని హరీశ్ రావు కోరారు.

కేంద్ర మంత్రిని కలిసిన వారిలో రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణ రావు తదితరులు ఉన్నారు .

🔴సానుకూలంగా స్పందించిన నిర్మల :

హరీశ్ వినతికి కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు. బీడీ కార్మికుల ఆర్థిక పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని, వారి జీవనోపాధి కోసం ప్రత్యేక ఆర్థిక ప్రేరణ కార్యక్రమాలు తీసుకురావాలని సూచించారు. బీడీ కార్మికులు, ముఖ్యంగా బీడీలు చేసే మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ఎలాంటి చర్యలు చేపట్టాలనే విషయంపై సమగ్రమైన ప్రతిపాదనలు అందజేయాలని మంత్రి హరీశ్‌ను కోరారు.
ప్రత్యేకంగా చొరవ తీసుకుని బీడీ కార్మికుల పునరావాసం కోసం ఆలోచన చేస్తే.. దేశమంతటికీ ఉపయోగపడే విధానం తీసుకురావడానికి ప్రయత్నిస్తామని మంత్రి హరీశ్ రావ్కు నిర్మలా సీతారామన్ హామీ ఇచ్చారు.


Discover more from TeluguWonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from TeluguWonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading