India-US Trade Deal: డీల్ కుదురుతుందోచ్.. అమెరికా టారిఫ్‌ల నుంచి భారత్‌కు బిగ్ రిలీఫ్‌! ట్రంప్ కీలక వ్యాఖ్యలు..

pm-modi-donald-trump1

అమెరికా టారిఫ్‌ల నుంచి భారత్‌కు బిగ్ రిలీఫ్‌ ఉండబోతుందా?. త్వరలో రెండు దేశాల మధ్య అందుకు సంబంధించిన డీల్‌ కుదరనుందా?. వందరోజుల పాలన పూర్తి చేసుకున్న ట్రంప్‌.. భారత్‌కు త్వరలోనే గుడ్‌ న్యూస్‌ చెప్పబోతున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలేంటి..? భారత్ గుడ్ న్యూస్ రాబోతుందా..? ఈ వివరాలను తెలుసుకోండి..

అమెరికా భారత్‌పై విధించిన 26శాతం సుంకాలు తగ్గనున్నాయా..? గుడ్ న్యూస్ రానుందా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇందుకు సంబంధించి రెండు దేశాల మధ్య త్వరలోనే డీల్ కూడా కుదిరే అవకాశాలు ఉన్నాయి. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కూడా ఇదే హింట్‌ ఇచ్చారు. భారత్‌తో త్వరలోనే వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. వందరోజుల పాలన పూర్తైన సందర్భంగా వైట్‌ హౌస్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఒప్పందాన్ని ప్రస్తావించారు ట్రంప్‌. భారత్‌తో టారిఫ్‌ చర్చలు జరుగుతున్నాయని.. ఇటీవల ప్రధాని మోదీ అమెరికాకు వచ్చిన సమయంలో సుంకాలపై ఒక ఒప్పందం చేసుకోవాలని నిర్ణయించామని తెలిపారు. త్వరలోనే అది కార్యరూపం దాలుస్తుందని భావిస్తున్నా అంటూ ట్రంప్‌ పేర్కొన్నారు.

భారత్‌తో డీల్‌పై అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్‌ బెసెంట్‌ సైతం మాట్లాడారు. రెండు దేశాల మధ్య టారిఫ్‌ చర్చల్లో పురోగతి కనిపిస్తోందని వెల్లడించారు. దీనిపై త్వరలో ఢిల్లీ ఒక ప్రకటన చేసే అవకాశం ఉందని తెలిపారు. ఇండియా లాంటి సానుకూలమైన దేశాలతో చర్చలు జరపడం సులభమన్నారు. అమెరికా వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుట్నిక్‌ ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ.. తమ దగ్గర ఒక వాణిజ్య ఒప్పందం ఉందని, కానీ దానికి ఆ దేశ ప్రధాని, పార్లమెంటు ఆమోదం తెలపాలన్నారు. అయితే, అది భారత్‌తోనే అయి ఉండొచ్చని తెలుస్తోంది.

ఇటీవల ట్రంప్‌ ప్రపంచ దేశాలపై టారిఫ్‌ల మోత మోగించారు. అనంతరం 90 రోజుల పాటు ఈ సుంకాల అమలుకు అమెరికా విరామం ప్రకటించింది. ట్రంప్‌ విధించిన సుంకాలపై .. చాలా దేశాలు ప్రతీకార చర్యలకు సైతం దిగాయి. అయితే, భారత్‌ మాత్రం భిన్నంగా ఆలోచించి.. ప్రతి సుంకాలకు బదులుగా అగ్రరాజ్యంతో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడంపై దృష్టి సారించి.. సఫలికృతమైంది. ఇటీవల ప్రధాని మోదీ అమెరికా పర్యటన సందర్భంగా ఇరుదేశాల మధ్య వాణిజ్య ఒప్పందానికి అడుగులు పడ్డాయి. ఇరు దేశాల ప్రయోజనాలు.. పరిస్థితులకు అనుగుణంగా ఒప్పందం చేసుకునేలా దేశాధినేతలు అంగీకారం తెలిపారు. ఇదే సమయంలో సుంకాలపై కూడా చర్చలు తుది దశకు వచ్చినట్లు తెలుస్తోంది.


Discover more from TeluguWonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from TeluguWonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Verified by MonsterInsights