మేడ్చల్ జిల్లాలో షాకింగ్ ఘటన… భార్య చేతిలో భర్త హత్య

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో ఘోర ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ తన సోదరుల సహకారంతో భర్తను హత్య చేసిన సంఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.
వివరాల ప్రకారం, రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం కర్కల్పహాడ్కు చెందిన జటావత్ నరేందర్ (40) తన భార్య సోనితో కలిసి జీవనం సాగిస్తున్నాడు. ఉపాధి కోసం హైదరాబాద్కు వచ్చి అన్నోజిగూడలోని లక్ష్మీనరసింహ కాలనీలో నివసిస్తూ కూలీ పనులు చేసుకుంటున్నారు.
ఇద్దరికీ మద్యం సేవించే అలవాటు ఉండటంతో తరచూ కుటుంబంలో గొడవలు జరిగేవి. సంపాదన మొత్తం మద్యం కోసం ఖర్చవుతుండటంతో కుటుంబ పరిస్థితులు కూడా క్షీణించాయి.
ఈ క్రమంలో మంగళవారం రాత్రి తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నరేందర్ నిద్రలో ఉండగా, భార్య సోనీ తన సోదరులు నానావత్ రమేశ్, నానావత్ భాస్కర్ల సహాయంతో దాడి చేసింది. చీరతో ఉరివేసి, తలను నేలకేసి కొట్టడంతో అతను తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మరణించాడు.
ఈ ఘటనపై మృతుడి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Discover more from TeluguWonders
Subscribe to get the latest posts sent to your email.
