Rat on Board: ఇండిగో విమానంలో ఎలుక, భయాందోళనకు గురైన ప్రయాణికులు.. విమానం 3 గంటలు లేటు..

rat-in-flight

కాన్పూర్ నుంచి ఢిల్లీకి వెళ్లే ఇండిగో విమానంలో ఎలుక కనిపించడంతో మూడు గంటల పాటు విమానం ఆగిపోయింది. ప్రయాణీకులను, సిబ్బందిని దింపివేసి విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఎలుకను పట్టుకున్న తర్వాత విమానం తిరిగి ప్రారంభమైంది. ఈ సమయంలో కొంతమంది ప్రయాణికులు తమ ప్రయాణాన్ని రద్దు చేసుకున్నారు. కొంతమంది తిరిగి తమ ప్రయాణాన్ని రీ షెడ్యూల్ చేసుకున్నారు.

ఆదివారం ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ నుంచి ఢిల్లీకి వెళ్లాల్సిన ఇండిగో విమానంలో ఎలుక కనిపించింది. దీంతో ప్రయాణీకులు భయాందోళనలకు గురయ్యారు. ఎలుక కోసం విమానం మూడు గంటలు ఆలస్యం అయింది. భద్రతా కారణాల దృష్ట్యా విమానాన్ని నిలిపివేశారు. ప్రయాణికులందరినీ దింపి విమానాశ్రయ లాంజ్‌కు తరలించారు.

ఢిల్లీ నుంచి ఇండిగో విమానం మధ్యాహ్నం 2:10 గంటలకు కాన్పూర్ విమానాశ్రయానికి చేరుకుంది. తిరిగి మధ్యాహ్నం 2:55 గంటలకు కాన్పూర్ నుంచి ఢిల్లీకి బయలుదేరాల్సి ఉంది. టేకాఫ్‌కు ముందు.. సిబ్బంది, కొంతమంది ప్రయాణికులు క్యాబిన్‌లో ఎలుక తిరుగుతున్నట్లు గమనించారు. ఈ విషయం తెలిసిన వెంటనే.. ప్రయాణికులలో, ముఖ్యంగా మహిళా ప్రయాణికులలో భయాందోళనలు చెలరేగాయి. సిబ్బంది, ఎయిర్ హోస్టెస్‌లు పరిస్థితిని అదుపులోకి తెచ్చి అందరినీ శాంతింపజేశారు. భద్రతకు ప్రాధాన్యతనిస్తూ.. విమానాన్ని వెంటనే నిలిపివేశారు. 189 సీట్ల విమానంలో ఉన్న మొత్తం 172 మంది ప్రయాణికులను బయటకు పంపించి లాంజ్‌కు పంపించారు.

ఎలుకని 3 గంటలు కష్టపడి పట్టుకున్న సిబ్బంది

కొంతమంది ప్రయాణీకులు ఆలస్యంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే ఎలుకను పట్టుకుని విమానం పూర్తిగా సురక్షితంగా ఉందని ప్రకటించే వరకు విమానం ప్రయాణం సాధ్యం కాదని విమానాశ్రయ అధికారులు స్పష్టం చేశారు. ఆ తర్వాత విమానయాన సంస్థ సాంకేతిక సిబ్బంది, గ్రౌండ్ సిబ్బంది విమానంలోని ప్రతి మూలలోనూ క్షుణ్ణంగా శోధించడం ప్రారంభించారు. దాదాపు మూడు గంటల పాటు తీవ్ర ప్రయత్నం తర్వాత, ఎలుకను చివరకు పట్టుకున్నారు.

ఇండిగో విచారం వ్యక్తం చేసింది.

కాన్పూర్ విమానాశ్రయ డైరెక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ.. ఎలుక ఉన్నట్లు సమాచారం అందిన వెంటనే చర్యలు తీసుకున్నామని చెప్పారు. నిర్వహణ బృందం విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసి, భద్రతను నిర్ధారించిన తర్వాతే విమానాన్ని క్లియర్ చేసింది. విమానం సాయంత్రం 6:04 గంటలకు 111 మంది ప్రయాణికులతో ఢిల్లీకి బయలుదేరింది. కొంతమంది ప్రయాణికులు తమ ప్రయాణాన్ని తిరిగి షెడ్యూల్ చేసుకున్నారు. మరికొందరు తమ టిక్కెట్లను రద్దు చేసుకున్నారు. ఇండిగో ప్రయాణికులకు జరిగిన అసౌకర్యానికి క్షమాపణలు చెప్పింది. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొంది.


Discover more from TeluguWonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from TeluguWonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Verified by MonsterInsights