విజయ్ ప్రభుత్వంలో శాఖల పంపిణీ.. హోం శాఖపై సీఎం ప్రత్యేక దృష్టి

తమిళనాడు రాజకీయాల్లో సంచలనం సృష్టించిన దళపతి జోసెఫ్ విజయ్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇటీవల ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విజయ్.. ఇప్పుడు తన మంత్రివర్గ సభ్యులకు శాఖలను కేటాయిస్తూ పాలనపై పూర్తి దృష్టి పెట్టారు. అయితే, అత్యంత ప్రాధాన్యత కలిగిన కొన్ని శాఖలను మాత్రం తన వద్దే ఉంచుకోవడం ప్రస్తుతం తమిళ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
మే 10న ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఆయనతో పాటు మరో తొమ్మిది మంది మంత్రులు కూడా బాధ్యతలు స్వీకరించారు. ఇప్పుడు వీరికి శాఖలను అధికారికంగా కేటాయిస్తూ తమిళనాడు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యంగా హోం శాఖను విజయ్ తన వద్దే ఉంచుకోవడం రాజకీయంగా కీలక నిర్ణయంగా భావిస్తున్నారు. ఎన్నికల సమయంలో రాష్ట్రంలో శాంతి భద్రతలను బలోపేతం చేస్తామని హామీ ఇచ్చిన విజయ్.. ఆ వాగ్దానాన్ని అమలు చేయడానికి హోం శాఖను స్వయంగా పర్యవేక్షించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
హోం శాఖతో పాటు మహిళా మరియు శిశు సంక్షేమ, యువజన సంక్షేమ, పురపాలక శాఖలను కూడా సీఎం తన ఆధీనంలోనే ఉంచుకున్నారు. ప్రజలకు నేరుగా సంబంధించిన ఈ శాఖలను పర్యవేక్షించడం ద్వారా ప్రభుత్వ పనితీరును మెరుగుపర్చాలని విజయ్ భావిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
క్యాబినెట్లో సీనియర్ నాయకుడు కేఏ సెంగొట్టైయన్కు ఆర్థిక శాఖ బాధ్యతలు అప్పగించారు. అలాగే పెన్షన్లు, పెన్షన్ భత్యాల విభాగాలు కూడా ఆయనకే కేటాయించారు. ఆర్థిక పరిపాలనలో అనుభవం ఉన్న నేత కావడంతో ఈ కీలక బాధ్యతలను విజయ్ ఆయనకు అప్పగించినట్లు సమాచారం.
మరోవైపు, మంత్రివర్గంలోని ఏకైక మహిళా మంత్రి సెల్వి ఎస్ కీర్తనకు పరిశ్రమల శాఖను అప్పగించడం ప్రత్యేకంగా చర్చకు దారి తీసింది. తమిళనాడు అభివృద్ధిలో కీలక పాత్ర పోషించే పరిశ్రమల శాఖను మహిళకు ఇవ్వడం ద్వారా విజయ్ తన ప్రభుత్వంలో మహిళలకు ప్రాధాన్యత ఇస్తున్నారనే సంకేతం ఇచ్చినట్లు భావిస్తున్నారు.
గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్, జలవనరుల శాఖలను ఎన్ ఆనంద్కు కేటాయించారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, పేదరిక నిర్మూలన, సాగునీటి ప్రాజెక్టుల పర్యవేక్షణ ఆయన బాధ్యతల్లో భాగంగా ఉంటాయి. అదేవిధంగా ప్రజా పనులు, రహదారులు, క్రీడాభివృద్ధి శాఖలను అదవ్ అర్జున్కు అప్పగించారు.
ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలను డాక్టర్ కేజీ అరుణ్రాజ్కు కేటాయించగా.. ఆహార మరియు పౌర సరఫరాల శాఖలను వెంకటరమణన్కు అప్పగించారు. ధరల నియంత్రణ, వినియోగదారుల రక్షణ బాధ్యతలు కూడా ఆయన పరిధిలోనే ఉంటాయి.
ఇంధన వనరులు, న్యాయ శాఖలను ఆర్ నిర్మల్ కుమార్కు అప్పగించారు. విద్యుత్, సాంప్రదాయేతర ఇంధన అభివృద్ధి, అవినీతి నిరోధక విభాగాలు కూడా ఆయన ఆధీనంలో ఉంటాయి. విద్యాశాఖ, తమిళ భాష అభివృద్ధి, సమాచార శాఖలను రాజ్మోహన్కు కేటాయించారు.
ఇదిలా ఉంటే, పూర్తి మెజార్టీ లేని కారణంగా కాంగ్రెస్ సహా మిత్రపక్షాల మద్దతుతో విజయ్ ప్రభుత్వం ఏర్పడింది. కాంగ్రెస్కు రెండు మంత్రి పదవులు ఇచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. త్వరలోనే క్యాబినెట్ విస్తరణ ఉండొచ్చని సమాచారం.
Discover more from TeluguWonders
Subscribe to get the latest posts sent to your email.
