*వ్యాక్సిన్: నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన*
*రూ.2.65 లక్షల కోట్ల ఆత్మనిర్భర్ భారత్ 3.0 ఉద్దీపన ప్యాకేజీ*
*వ్యాక్సిన్ అభివృద్ధికోసం రూ.900 కోట్లు* న్యూఢిల్లీ: కరోనా వైరస్ టీకా కోసం దేశమంతా ఎదురు చేస్తున్న వేళ కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కీలక విషయాన్ని ప్రకటించారు. కోవిడ్-19 మహమ్మారి అంతానికి సంబంధించి టీకా పరిశోధన, అభివృద్ధి కోసం 900 కోట్ల రూపాయల నిధులను ఆర్థిక మంత్రి ప్రకటించారు.
మూడవ ఉద్దీపన ప్యాకేజీ ప్రకటనలో భాగంగా ఈ నిధులను ఆమె గురువారం వెల్లడించారు. వ్యాక్సిన్ పరిశోధన, అభివృద్ధికి మాత్రమే ఈ నిధులు వినియోగించనున్నామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు.
కోవిడ్ సురక్షా మిషన్ పేరుతో ప్రకటించిన ఈ పథకం కోసం బయోటెక్నాలజీ విభాగానికి ఈ నిధులను అందించినట్టు చెప్పారు. రూ .2.65 లక్షల కోట్ల ఆత్మనిర్భర్ భారత్ 3.0 ఉద్దీపనలో ఇవి భాగమని తెలిపారు. కాగా ఇప్పటికే భారతదేశంలో పలు వ్యాక్సిన్ ట్రయల్స్ దశల్లో ఉన్నాయి. ఈ పరిశోధనల పురోగతిని అంచనా వేయడానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ సమీక్షా సమావేశాన్ని కూడా ఇటీవల నిర్వహించారు.
ఈ రివ్యూ మీటింగ్లో ఆరోగ్యమంత్రి హర్ష్ వర్ధన్, నీతి ఆయోగ్ సభ్యులు, సీనియర్ శాస్త్రవేత్తలు, ఇతర అధికారులు పాల్గొన్నారు. వ్యాక్సిన్ పరిశోధన, అభివృద్ధి ఖర్చుతో కూడుకున్నదన్న అంచనాల అనంతరం ఈ నిధుల ప్రకటన రావడం విశేషం. మరోవైపు టీకా ఉత్పత్తిలో భారతదేశం పాత్రను డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ గురువారం ప్రశంసించిన సంగతి తెలిసిందే.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.